ప్యానం ఏదైనా ఒకటే
నారాయుడు
"ఒరే నారాయుడూ! కరెంటు పోనాది. ఈడంతా గబ్బగీం. బ్యాట్రీ దీపమో,లాంతరో ఒట్రారా అయ్యా.
ముసిల్దాన్ని ఏ పామో, పురుగోపుట్రో కుట్టి , కునికేస్తే శనేశ్పరమొదిలేస్తాదని సూత్తండావా తండ్రీ"
అని అరుత్తోంది కదండీ అది మాయమ్మండీ.
" య్యోవ్ ! నేను పిల్ల కాడుండా. పొయ్యిమీన కూడుడుకుతాంది. ఈడ్నే ఉండు. వస్తదిలే "
అంటాంది కదండి అది మా ఆడమడిసండి.
"పొయ్ లో మంటుండాది గదమ్మే. కాపడ్తదిలే ". అని లాంతరట్టుకొని బయటికెళ్తున్నానండీ.
" వాన రాకడ ప్యానం పోకడే గాదే కరెంటు పోకడ గూడా తెల్దుగదేయమ్మా" అన్నానండీ.
"గేదెకాపట్లేదురా.ఎటెల్లబారినాదో . ఎతుకులాడ్నా . . బుగత గారి మడిలో పడ్నాదంటే
గొడ్డును బాదినట్టు బాత్తార్రా తండ్రీ" అంటా గోస పెడ్తానే ఉందండయ్యా.
"అది గొడ్డేగదమ్మా " ఆని ఇకిలించినానండి
"నువ్ కొంప లోకి రాయే. సిన్నమ్మికి బాలేకపొయ్నా ,ఊష్ణమెట్టుకున్నానీకు గేదే ముక్కెమా?ఎంతకీ దానూసేనా ?" అన్నానండయ్యా.
సెయ్యి పట్టుకోని తెద్దారంటే ఇదిలించి కొట్టిందండి.
"మద్దినేళ పచ్చగడ్డి మోపు నెత్తి నెట్టుకోని కయ్య కాణ్ణించి ఒక్కత్తినే ఒచ్చినా.
ఆ టయాం లో నువ్వుగాని ఉండావేట్రా బోడిసాయానికి. కళ్ళు బానే ఉండాయిలే" అందండి.
"పదపదవే కనకమాలచ్మి. ముత్యాలమ్మా, బంగారమ్మా ,మాయమ్మా" అని మురిపెం ఆడినానండి.
"ఓరబ్బీ ఆడ కరెంటు తీగలు తెగిపడినకాడ నీ గేదె ఆట్ని ముట్టేసినాదిరా.
డొంకలో దొంగ మేత కెల్తా సిక్కడి గిలగిల కొట్టుకుంటాండాది" అని కొండడు అరుస్తున్నాడండయ్యా.
దేవతల్ని పిలస్తండగానే మురిపెం ముక్కలయిందయ్యా. నా పెబువా! దేవదేవా!
ఓలమ్మో ఓలమ్మో అని మాయమ్మ శోకండాలెడ్తందండీ.
నానేమో కాలుసెయ్య పడిపొయినట్టు బిత్తర సూపులు సూత్తా ఉన్నపాట్ని కూలబడ్డానండయ్య.
సిన్నతనాన వానావానావల్లప్ప ఆటలో ఊపెక్కి బిరాన తిరిగి తిరిగి ,ఆగితే గిర్రున తిరిగినట్లు తిరుగుతుండాయండీ కళ్ళు .
ఇజ్జూసింతర్వాత ఆడే మద్దిగాలకొచ్చి ఆలోశనజేసి,
"బుగతనడిగి టైరుబండొట్టుకొస్తానొరే. పిల్లదానికి బాలేదన్నావు . గేదెనీ , పిల్లనీ టౌనెట్టు కెల్దాం.
పశువుల డాట్టరు, మన డాట్టరు పక్కపక్కనే గందా "అని ఎల్నాడండయ్యా.
"ఓయ్యో. పిల్ల కళ్ళు తేలేస్తండాది.ఆరెంపీ (RMP)మందు పన్జెయ్యలా" అని మా ఆడదాయి గోలెడ్తందయ్యా.
కొండడు
నారాయుడికి నోట్లో నాలికుండదు.నన్నే తల్లో నాలికంటాడు .ఆడెళ్ళినా నాబం ఉండదు అనుకోని బయల్దేరినా.
బుగత కాడికెల్తన్నానే కానీ ఆడేటంతడో,ఏటి పేల్తడో అని బెంగగానే ఉండాది.
మాది పెద్దూరేం కాదు. గట్టిగా ఈ కొసనుండి ఆ దెసకి నడిస్తే గసెట్టకుండా సిటికెలో ఎళ్ళొచ్చు.
దార్లో చింత చెట్లు, ఏపచెట్లు జాతర్లో కల్లుదాగి జుట్టిరబోసుకున్న గణాచార్లా బీకరంగా ఊగిపోతండాయ్.
నీళ్ళతో గోడగడ్తున్నట్లు వాన ముంచేస్తాంది.
చెర్లో కప్పలు ఎనకొస్తున్న పామును చూడకుండా బెకబెకలాడ్తా ఎర్రిగోల సేత్తండాయ్.
తాటాకు గొడుగే గాదు దేవుడూరేగింపు గొడుగులుగూడా ఎగిరి పొయ్యేలా గాలీసేస్తాంది.
ఈదరుగుల మీది ఈదికుక్కలు గూడా గుండేసి కొట్టినట్టు మాయమయ్ పోనాయ్. పిట్టపురుగు సంచారం లేదేడా.
సీఆంజనేయం పెసన్నాంజనేయం పాడ్తా, అర్జున ఫల్గుణ పేర్లు సదువుతా ఆకరికి సేరినా.
ఊరంతా కొట్టకుపోతన్నా ఆడికేం.కోడికూర దిని ఇప్పసారా దాగి ఎచ్చగా తొంగుండాడు.
మసకెల్తుర్లో పొగాక్కాడ సుట్ట సుడ్తా వత్తంటే 'బండెడు బోనం, రెండెనుబోతులు,నంజుడుకో మడిసి'
రోజూదినే బకాసురుళ్ళా కాపడి , నన్నిరసకదింటాడేమో అని జడుపుకొచ్చింది.
ఏనుక్కి పులిలాగా ఎర్రటి కళ్ళుంటే ,అది చెరుకు తోట మీదికి ఎట్లా ఉరుకుద్దో అట్లా వచ్చిండు.
ఎనకాల గోడమీన ఆడి తల నీడ , పక్కని ఏటవాలుగా పడ్తా ఉంటే రెండు తలల రాచ్చసుళ్ళా అనిపిస్తాండాడు.
"వత్తన్నా గందా ఈలోనే సావిట్లోకొచ్చెయ్యాలేట్రా సుద్దిబుద్దంలేని ఎదవా . లబిడీబురదంతా నీ పెళ్ళామొచ్చి తుడస్తదేటి" ఆని కసిర్నాడు.
" రేయ్ ! బండి ,సొమ్ములూ ( పశువులు) వూరికే రావ్.
కందులో పెసలో పంపించమని చెప్పు ఈడీకీ, ఆడికీ"
అని పెద్ద పాలేర్ని పురమాయించినాడు.
బండొస్తాదో రాదో అని శంకే అయినా సిద్దంగా ఉండారందరూ.
నారాయుడి బార్య దొండపాదు పక్కన నిలబడుండాది.
అది కోక ఒంటిమీన సుట్టుకోని నిలబడ్తే దానికీ , దొండ తీగ పాకిన గడకర్రకీ తేడా తెలియట్లేదు.
ముసిల్ది శబరిలా వొంగిపోయినా సత్తువతో కాదు ,గుండెదైర్నంతో బతికేస్తంది.
ఆ పెయాణమంతా ,గుళ్ళో హరికథలో కర్ణుడి సావులా,రకరకాల శాపాల్తో ఒల్లమాలిన అగసాట్లయింది.
యుద్దంలో ఆయనగోరి రతానికి , డొంకలో మా బండికి దిగబడ్డం సామాన్యమయింది. బండి బురదలో దిగడిపోయింది. ఎత్తతావుంటే పక్కన బండి గాడిలో జరజరమంటుంది వాన్నీళ్ళో పామో ఆ దేవుడి కే తెల్చు.
పశువుల డాక్టేరుబాబు రామయ్యగోరు పెద్దమడిసి. లోకంలో శోకమంతా సూసి మూగోడయినట్లు మాటల్తక్కువ..మంచోడే.
మన డాక్టేరు శ్రీధర్ బాబు ఇంకా కుర్రాడే. జనాలకేదో సేద్దాం అన్న బ్రెమ సావనోడు.
సావులు తక్కువే సూడ్డంవల్ల పెజల బాదలకీ కట్టాలకీ కుమిలిపోక పొయినా , కదిలిపోతాడు.
మా వూర్లో దొంగెదవలు ఆణ్ణి వాడేయొచ్చు ,ఆడేయొచ్చుఅని ఊసులెట్టుకుంటారు.
బలి చక్కొర్తినీ, శిబి చక్కొర్తినీ, దర్మరాజునీ కూడా పనికిమాలినోళ్ళని ఎకసెక్కాలాడతారు మా జనం.
మంచి అంటే శాతకానితనమనుకునే ఎకిలితనం.
ఆళ్ళిద్దరూ బిడ్డనొట్టుకొని దర్మాసుపత్రి లోకెల్లారు.
ఆళ్ళెల్లాక పశువులాస్పత్రి కాడ నేను, వాళ్ళమ్మ గేదెని దింపించి లోనికి ఒట్టుకెళ్ళిపొయ్యాం.
" రామయ్య బాబూ . ఆబోరు దక్కించు. దయసూడు తండ్రీ,." ముసిల్ది దణ్ణాలెడతంది.
"కష్టంరా కొండా. బాగా షాక్ తగిలింది.వైద్యం చేద్దాం. పెద్ద ఆశ లేదు." అని ఇండీషను గుచ్చి , మందు పట్టి , వైద్దిగం సేసి కూసున్నారు.
ముక్కుతామూల్గుతా ఉంటే " పిల్లకెలాగుందో " అని అమ్మ తో మాటగలిపి
" గేదె నారాయుడిదయ్యా. ఈవిడ వాళ్ళమ్మ. పిల్లకి ఊరంత జొరమండి. ఆడూ పెళ్ళాం పక్కనున్నారయ్యా" అని సెప్పినా.
ఆయనేదో ఆలోశనగా ఆచ్చెర్యంగా సూశారు.
నిమిట్లు లెక్కెడతా అట్టా కూకున్నాం. గేదె గిజగిజ అమ్మ మూలుగు ఎన్నుపూసకి సలెక్కిస్తున్నాయి.
ముసిల్ది కడుపులో కాళ్ళెట్టుకొని గోడకి సేరగిలపడింది.
చలికి ఆకలికి ఎవురిమీదో తెలీని చేతకాని కోపమొస్తాంది.
పెద్ద ఉరుమురిమి మెరుపు కొట్టింది. నైట్లన్నీ ఆరిపొయినై. యమర్జెన్సి దీపం ఎలిగింది.
పిట్టేదో సచ్చిపోయి ఏపచెట్టు మీంచి టప్పున పడింది.
షెడ్డులో, నా సుట్టూతా, కసింత దూరం దాకా చావు కొండశిలవలా సుట్టుకొని,
పీక నొక్కతా ఊపిరాడనియ్యనట్లు, దెయ్యం సెవిలో గుసగులాడ్తున్నట్లు ఆనిపిస్తంది.
బయం,బెంగ జమిలిగా మీనకి దండెత్తి ఒణికిస్తండాయ్.
గేదె ఎగశాస పెట్టి బిగుసుకు పోయింది.
అటేపే సూస్తున్నముసిల్ది ఎర్రికేకెట్టి ఏడవటానికి కంట్లో సుక్కల్లేనట్లుఊగిపోతాంది.
దూరంనించి ఏడుపులు వినిపించబట్నాయ్.
గుండెలు బాదుకుంటా ఆయమ్మీ, పిల్ల శవాన్ని సేతులమద్దెకెత్తుకొని బతికున్న శవంలా ఆడు వస్తండారు.
సెదిరిపోయి ముడూడిపొయిన జుట్టునీ,జారిపోయి కాళ్ళకడ్డం పడ్తన్న పైటనీ , గాలెనక్కి తోత్తంటే, అయమ్మి తెల్లచీరలో తూలిపోతా కూలిపోతా ఉరకతంటే బక్క పిశాచంలా, తోకదెగి తుప్పల్లో సిక్కడ్డానికి దిగతన్న గాలిపటంలా ఆన్తంది.
నాగ్గూడా దుక్కం తన్నుకొచ్చి , దొర్లి దొర్లి శోకాలెట్టినాం .
డాక్టర్ శ్రీధర్
ఇలాంటివి చూస్తేనే మనసు కలతపడి బాధ కలుగుతుంది.
అంత జ్వరం ఉన్న పాపను వర్షం లో తడుస్తూ,తడుపుతూ తేవలసి రావటంలో వాళ్ళదే మొత్తం తప్పా?
రోగం ముంచుకొస్తున్నా ఏవో బిళ్లలు మింగించి , ముదరబెట్టి చావుని రోగితో పాటే తీసుకొచ్చేలా చేసేది మూర్ఖత్వమా, అశక్తతా?
చావుని చూసిన ప్రతి సారీ సిద్ధార్ధుడిలా చలించటంబలహీనతా, మానవత్వమా?
చలించకుండా స్థితప్రజ్ఞుడినవుతానేమో?
అప్పుడు జీవితం ఉప్పు కారం లేని మిరపకాయ బజ్జీలా అవుతుందా? ప్రశ్నలు ఎక్కువవుతున్నాయి.
మరణం చూసిన ప్రతిసారీ అలవాటు, స్నానం చేసి తనువు ,మనసు శుభ్రం చేయడమనే భ్రమ.
ఇలాంటి సమయంలో పెద్దాయన తో గడపటం ఆనవాయితీ. ఇళ్ళ మధ్యలో దూరం తక్కువ. బయల్దేరాను.
' నిబిడాంధకారంలో దివాంధంలా నేను ఆలపించే విషాదగీతం విశ్వసంగీతం ' అని తోచిన పదాలు ప్రారంభంగా గేయం మనసులో రూపు దిద్దుకుంటోంది.
కీచురాళ్ళ పాటకి , కప్పల గొడవ,గాలిహోరు పక్క వాయిద్యాలతో కచ్చేరీ జరుగుతోంది.
నాతోపాటు రెయిన్ కోట్ ని కూడా వెనక్కి తోస్తున్న గాలితో సుమో పహిల్వాన్ లా పోరాడి గేట్ తీశాను.
మూడ్ బాగోలేక టీ తాగొచ్చు, ఇంకేదో చెయ్యచ్చు అని వెళ్ళిన నాకు ,
చావు పరిచయం ఉన్నదే అయినా నిర్ఘాంత పరిచే దృశ్యం ఎదురయింది.
పశువుల హాస్పిటల్ లో మనిషి శవం తో ఏడుపులు ,
రానురాను మనుషులు పశువులవుతున్నారని డ్రమాటిక్ ఐరనీ తో చెప్తున్నట్లుంది.
కొన్ని పదాలు తటాలున మనసులో మెదుల్తాయి.
ముసలావిడ అప్పుడంటున్న మాటలు 'అశనిపాతం' లా తాకాయి.
"" నాయనా కొండయ్యా. ఇద్దరూ వొయసులో ఉండారు. మళ్ళా గుంటో ,గుంటడో కడుపున పడకపోరు.
వొంశం కోసం కనకా తప్పదూ, పెంచకా తప్పదూ తండ్రి.
ఎండీబంగారంలాటి గేదెనెట్లా తెత్తాడయ్యా నా బిడ్డ.
బగమంతుడా నీకు దయ లేదు సామీ. ""
వింటున్న నాకు మనసు వికలం అయిందో , శకలం శకలం గా బద్దలయ్యిందో తెలీదు.
పెద్దాయన ముఖంలో ఏమిటా అంతుచిక్కని భావం? నిర్లిప్తతా? నిస్సహాయతా?విషాదమా? వైరాగ్యమా?
మర్నాడు ఉదయాన్నే , ఒత్తిడి తగ్గించుకోటానికి వెళ్ళే మార్నింగ్ వాక్ , వర్కవుట్ నించి ఆయన ప్రహరీలోకి నడిచాను.
కళేబరానికి , శవానికి , మిగిలిన జీవచ్ఛవాలకి తిరుగు ప్రయాణం ఏర్పాట్లు చేసి ,
బలవంతాన ఇడ్లీలు దోశలు తినిపించి , కాఫీలు తాగించే ప్రయత్నం చేస్తూ
అనుచరుల జేజేలందుకుంటున్న లోకల్ నాయకుల ఔదార్యం
స్వార్ధం లా కనిపించే సినిసిజం నుంచి బయటపడే మార్గం వెతికాను.
వీళ్ళు చెయ్యగలిగింది ఇంతేనా అని మనసులో తలెత్తి , ప్రబలమవుతున్న అనుమానం.
గుమ్మంలోకి నడిచాక లోపల్నించి కాఫీ ఘుమఘుమలు వస్తుంటే , "మార్నింగ్ సార్ "
అని అరిచి నాకూ ఒక కప్ అని సంకేతమిచ్చాను.
ఎదురుగా టేబుల్ మీద ఆయన అడపాదడపా భావాలను భద్ర పరుచుకొనే తెల్లకాగితాల పుస్తకం గాలికి
రెపరెపలాడ్తోంది.
రోజూ చూపిస్తారూ చూస్తానూ కనుక యథాలాపంగా ఆఖరి పేజీ తిరగేశాను.
It is a hardcore thought which was forcibly rubbed into her ,
culminating out of lifetime of misery and suffering from poverty
which created this realistic otherwise pitiable perspective..
జీవితకాలం కష్టాలు , పేదరికం తో పీడించబడి బలవంతాన రుద్దబడిన
దయనీయమయిన వాస్తవిక దృక్పథం నించి బయటపడి
పతాక స్థాయికి చేరిన కరుడుకట్టిన కటువైన ఆలోచన.
ఆయన రెండు భాష లలో రాసింది ఏమిటో,ఎవరి గురించో భావం అర్థం అయింది.
కానీ ఈ ప్రపంచం గురించి, కొన్ని జీవితాల గురించి అవగాహన మాత్రం
అసందిగ్ధంగా అసంపూర్ణంగా అసమంజసంగా అనిపిస్తూ మిగిలిపోయింది .
ప్రస్తుతంఆయనతో చర్చకు కానీ,సంభాషణకు కానీ సిధ్ధంగా లేననిపించింది.
దిగులా,దిగ్భ్రాంతా,దుఖమా తెలియని వివశత లో దిగ్గున లేచి ఇంటి వైపు నడిచాను.
.